అన్నవరం: ఈ నెల 27వ తేదీన జరుగనున్న సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవానికి వంగా రామకృష్ణ, భవాని, తారకరామ శివసాయి, సూర్య ఐశ్వర్యాంబిక (కాకినాడ) 500 గ్రాముల మంచి ముత్యాలను ఆదివారం అందచేశారు. దాత కోరిక మేరకు వీటిని స్వామివారి కల్యాణంలో ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.
పెదరాయవరంలో చోరీ
● నగదు, బంగారం, వెండి అపహరణ
● సొత్తు విలువ సుమారు రూ.3 లక్షలు
రంగంపేట: మండల పరిధిలోని పెదరాయవరం గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఊరు వెళ్లి తిరిగి వచ్చేలోపు ఇంటిని గుల్ల చేశారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఈ చోరీపై ఎస్ఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మందపాక బుచ్చిబాబు తన భార్యతో కలసి ఈనెల 13వ తేదీ సోమవారం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లి ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చారు. ఇంటిలోకి వెళ్లి చూడగా ఇంటి వెనుకవైపు తలుపు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి దొంగతనం చేసినట్టు గుర్తించారు. గదిలో ఉన్న ఇనుప అల్మరాను పగుల గొట్టి దానిలోని మూడు ఉంగరాలు, 290 గ్రాముల వెండి, నగదు చోరీ చేసినట్టు గుర్తించారన్నారు. సొత్తు విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు. బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
అగ్నిప్రమాదంలో తాటాకిళ్లు దగ్ధం
పిఠాపురం (గొల్లప్రోలు): మండలం చిన జగ్గంపేట సగర కాలనీలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించి రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎం.అప్పయ్యమ్మ ఇంటిలో వంట చేస్తుండగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించి ఆమె బయటకు పరుగులు తీసింది. ఆమె ముగ్గురు కుమారులు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో గృహోపకణాలు, వంట సామగ్రి, బట్టలు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదానికి కారణాలు విశ్లేషిస్తున్నట్టు విశ్లేసిస్తున్నట్లు పిఠాపురం అగ్నిమాపక అధికారి డి.రామకృష్ణ రాజు తెలిపారు.


