అమలాపురం టౌన్: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నూతలపాటి పరమేశ్వరరావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఈనెల 17న జరిగిన ఎడ్ల రాతి బండ పోటీల్లో స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్, పశు పోషక రైతు యాళ్ల నాగ సతీష్కు చెందిన ఎడ్ల జత రాతిబండను లాగి విజేతలుగా నిలిచాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో సతీష్ పోషణలో పెరుగుతున్న ఎడ్లు 6వ స్థానంలో నిలిచి బహుమతి గెలుచుకున్నాయి. ఈ మేరకు నాగ సతీష్ను నిర్వాహకులు సత్కరించి బహుమతిని అందజేశారు. నాగ సతీష్ తండ్రి అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత యాళ్ల మల్లేశ్వరరావు కూడా పశుపోషక రైతే. ప్రత్తిపాడులో గెలుపొందిన ఎడ్లను హరి, ఉగ్ర పేర్లతో పిలుస్తారు.
విద్యుత్ చౌర్యంపై విజిలెన్స్ దాడులు
● ఐదు సర్వీసులపై కేసు నమోదు
● రూ.3 లక్షల జరిమానా
కాట్రేనికోన: మండలంలోని గచ్చకాయలపోరలో రొయ్యల చెరువులకు కొంతకాలంగా అక్రమ విద్యుత్ వినియోగిస్తున్నట్టు అందిన సమాచారంతో విజిలెన్సు అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖీలలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. 5 సర్వీసులకు మొత్తం రూ.3 లక్షలు జరిమానా విధించినట్టు విజిలెన్సు ఈఈ డీపీఈ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ అక్రమ వినియోగానికి పాల్పటిడే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడులలో ఎ.మురళి డీఈ డీపీఈ, వి.భరత్ కుమార్ ఏఈఈ డీపీఈ, డి.జీవానందం ఏపీటీఎస్, సీఎస్ తదితరులు పాల్గొన్నారు.


