● మహిళలపై చంద్రబాబు రెండు నాల్కెల ధోరణి
● కేంద్రానికి మద్దతు
ఉపసంహరించుకోగలరా?
● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సూటి ప్రశ్న
అమలాపురం టౌన్: పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ కాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పైకి నటన, లోపల వంచన అన్నట్టు రెండు నాల్కల ధోరణితో దేశ చరిత్రలో ఇదో బ్లాక్ డే, మహిళలు క్షమించరని పెద్దపెద్ద మాటలు అంటున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతున్న ఆయన మహిళా బిల్లు విషయంలో మద్దతు ఉపసంహరించుకుంటామని మోదీకి వార్నింగ్ ఇస్తే ఆ బిల్లు ఎందుకు పాస్ కాదని ప్రశ్నించారు. స్థానిక హైస్కూలు సెంటర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి అండ కావాలి, మరో పక్క మద్దతు ఉపసంహరించుకునే సత్తా లేనప్పుడు బిల్లు పాస్ కానందుకు మహిళలు క్షమించరు.. ఇది బ్లాక్ డే అనకూడదని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన ప్రభుత్వంలోని బీసీ వెల్ఫేర్ మంత్రి చెల్లుబోయిన వేణు కుల గణనకు శ్రీకారం చుట్టారు. ఆ గణన సర్వే నివేదికను అసెంబ్లీలో యథాతథంగా అమలు చేయండని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలకు ఎమ్మెల్సీ సూచించారు. ఓబీసీలకు 2011లో సోషియో ఎకానమిక్ కాస్ట్ సెన్సస్ జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆ సెన్సస్ జరిగి ఏళ్లు గడుస్తున్నా పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. పాస్ చేయలేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు గుర్తు చేశారు.


