● అక్షయ కొనుగోళ్లకు సెంటిమెంట్ తోడు
● ఊగిసలాడుతున్న పేద, మధ్య తరగతి వర్గాలు
● చంద్రబాబు పాలనలో సన్నగిల్లిన కొనుగోలు శక్తి
● నేడు, రేపు క్రయ విక్రయాలపై వ్యాపారుల ఆశలు
కపిలేశ్వరపురం: అర గ్రాము బంగారం అపురూపమైన రోజులు ఇవి. ఇతర దేశాల్లో ట్రేడింగ్ కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తుండగా మన దేశంలో ఆభరణాల కోసం కొనుగోలు చేస్తుంటారు. నేడు బంగారం కొనుగోళ్లను ఆధ్యాత్మికానికి జోడించి అక్షయ తృతీయ సెంటిమెంటును పెంచుతున్నారు. ఎంత చిన్న మొత్తమైనా బంగారం కొంటే ఆ సంపద అక్షయమవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2,500కి పైగా బంగారు దుకాణాల్లో ఆ రోజున సుమారు రూ.125 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక కథనం.
లోహంలో బంగారం శాతం ఇలా...
బిస్కెట్ లేదా కాయిన్ రూపంలో ఉండే బంగారాన్ని 24 క్యారట్ల స్టాండర్డ్ బంగారంగా పరిగణిస్తారు. దీని క్రయ విక్రయాలు సులభతరంగా ఉంటాయి. విక్రయించాలనుకున్న రోజు బంగారం ధర ఎంత ఉందో అంత లభిస్తుంది. 91.6 బంగారం, 8.4 శాతం రాగి, వెండి తదితర లోహాలున్న కలిసి ఉన్నదాన్ని 22 క్యారెట్ల బంగారంగానూ 75 శాతం బంగారం, 25 శాతం ఇతర లోహాలుతో ఉన్నదాన్ని 18 క్యారెట్ల బంగారంగానూ పరిగణిస్తారు.
గతంలో ఇలా...
● 2000 సంవత్సరంలో పది గ్రాముల బంగారం ధర రూ.4,400 ఉండేది. 2005లో రూ.7వేలు, 2010లో రూ.18,500, 2015లో రూ.26,300, 2020లో రూ.46 వేలు, 2025లో రూ.98,500, ప్రస్తుతం రూ.1,55,000 పెరుగుతూ వచ్చింది. ఇలా ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లకు దూరమవుతున్న వినియోగదారుల కోసం కార్పొరేట్ బంగారు దుకాణ దారులు ఆఫర్లుతో పాటు గిఫ్ట్ ఓచర్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తున్నారు.
● పెరుగుతున్న ధర.. తరుగుతున్న జీవన ప్రమాణాలు..
● బంగారు ధరల పెరుగుదల స్వర్ణకారుల జీవితాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలోని బంగారు దుకాణాలకు ఆర్డర్లు తగ్గిపోతూ వచ్చాయి. వివాహాది శుభకార్యాలు వంటి సందర్భాలలో తప్ప బంగారం జోలికి ఎవరూ వెళ్లడం లేదు.
చంద్రబాబు ప్రభుత్వంలో తగ్గిన కొనుగోలు శక్తి
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఏ విధమైన ఆర్థిక సాయమూ అందడంలేదు. పనుల్లేక, జీతాలు పెరగక ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. దీంతో బంగారం క్రయ విక్రయాలు అదే స్థాయిలో తగ్గిపోయాయి.


