ఏలేశ్వరం: గుప్తనిధుల కోసం యర్రవరంలోని ధనాల కొండపై తవ్వకాలు చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్టు ఎస్సై రామలింగేశ్వరరావు గురువారం తెలిపారు. యర్రవరంలో పురావస్తుశాఖ అధీనంలో ఉన్న ధనాలకొండపై గుప్తనిధులు ఉన్నాయని ఆరుగురు తవ్వకాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. నిందితులతోపాటు వారి నుంచి కట్టర్లు, జనరేటర్, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తవ్వకాలు చేసిన వారిలో గండేపల్లి మండలం ఉప్పలపాడుకు చెందిన టి శివశంకర్, రాజమహేంద్రవరం రూరల్ కాతేరుకు చెందిన ఓ వీరసాయికుమార్, వి.గణపతి, డి.గోవిందస్వామి, కె.సతీష్, బిక్కవోలుకు చెందిన ఎస్ శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై బైండోవర్ కేసు నమోదు చేసి తహసీల్దార్ కోర్టులో హజరుపరిచారు.


