ఆత్రేయపురం: ఇటీవల కాలంలో వినియోగదారులు గ్యాస్ సిలిండర్లు సక్రమంగా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఆత్రేయపురం అరుంధతి పేటకు చెందిన ఉందుర్తి మనోహరం బుధవారం పోలీసులకు తాను సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ డెలివరీ చేయలేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం లక్ష్మీ తులసి భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారుడు ఉందుర్తి మనోహరం 10 రోజుల క్రితం సిలిండర్ బుక్ చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం ఓటీపీ లేకుండా, సిలిండర్ తీసుకోకుండా డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీనిపై తనకు సిలిండర్ అందించకుండా మోసం చేసిన గ్యాస్ ఏజెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవల ఆత్రేయపురంలో పలువురు వినియోగదారులకు బుక్ చేసుకున్నప్పటికీ సిలిండర్లు అందించకుండా బ్లాక్ లో ఏజెన్సీ వ్యక్తులు అమ్ముకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు.


