శంఖవరం: మండలంలోని నెల్లిపూడి గ్రామంలో కలిదిండి సత్యనారాయణ ఇంటిని ఓ టిప్పర్ ఢీకొంది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రౌతులపూడి నుంచి శంఖవరం మీదుగా కాకినాడకు భారీ రాళ్లతో టిప్పర్ వెళుతోంది. మంగళవారం తెల్లవారుజామున అది అదుపు తప్పి నెల్లిపూడిలో సత్యనారాయణ ఇంటికి బలంగా ఢీకొని బోల్తా పడింది. నిద్రలో ఉన్న సత్యనారాయణ భారీ శబ్ధానికి ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఇల్లు, జీవనోపాధిగా నడిపే వాటర్ ప్లాంట్ ధ్వంసమయ్యాయి. కాగా.. ఈ రోడ్డులో నిరంతరం భారీ లోడుతో లారీలు అతి వేగంగా రాకపోకలు చేస్తున్నాయని, దీనిపై పలుమార్లు ధర్నాలు చేసినా, వినతి పత్రాలు సమర్పించినా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ వాటిని అదుపు చేయలేకపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.


