● ఘనంగా 135వ జయంతి వేడుకలు
● పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ,
ప్రజాప్రతినిధులు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని పలువురు కొనియాడారు. రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ కీర్తి, ఎస్పీ నరసింహ కిశోర్, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ రాజమహేంద్రవరం పర్యటన సమయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన అద్భుత ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. చదువు ద్వారానే వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగగలడని అంబేడ్కర్ జీవితాంతం విద్యను ఆయుధంగా ఉపయోగించారన్నారు. రోజుకు 18 గంటలు చదవుతూనే ఉండేవారంటే ఆయనకు చదవు పట్ల ఎంత అభిలాష ఉందో అర్థం చేసుకోవచ్చున్నారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ప్రజాప్రతినిధులు, ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.సందీప్, ఆర్డీవో ఆర్.శివరాముడు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో..
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు రెవరెండ్ ఎం.విజయ సారథి ఆధ్వర్యంలో నాయకులు జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ప్రారంభమై ఏడు నియోజకవర్గాలలో ఉన్న 19 మండల కేంద్రాల్లో ఉన్న ఆయా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అంబేడ్కర్ ఆశయాలను పుణికి పుచ్చుకున్న జగనన్నను 2029లో ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దళితులు, క్రైస్తవులు జగనన్ననే ముఖ్యమంత్రిని చేయబోతున్నామని నినదించారు. మండల అధ్యక్షుడు రెవరెండ్ షిమ్మీ, రెవరెండ్ కల్వరి కుమార్, పిట్ట డానియల్, కరుణాకర్, వైఎస్సార్ సీపీ అభిమానులు పాల్గొన్నారు.


