రాష్ట్ర హోంమంత్రికి వైఎస్సార్ సీపీ నేత నాగమణి హితవు
కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీపై విమర్శలు చేయడం కాదు, ముందు మీ పార్టీ గతం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి అనితకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి హితవు పలికారు. విమర్శల్లో హుందాతనం లేకుండా పోయిందని, మీరూ ఒక మహిళ అనే విషయం మరిచిపోయారా అని నాగమణి ప్రశ్నించారు. కాకినాడ గైగోలుపాడులోని తన నివాసంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని విమర్శించడానికి మీరు అధికారంలోకి వచ్చారా అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో మాజీ సీఎం సూచనలు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలే గానీ డైవర్షన్ రాజకీయాలు సరికాదన్నారు. దివంగత ఎన్టీఆర్ మరణానికి కారణం ఎవరన్నది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసునని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాధవరెడ్డి, బాలయోగి, యర్రంనాయుడు వంటి నేతల మరణాలపై అనుమానాలు ఉన్నాయని, ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రజలే ప్రశ్నిస్తున్నారని టీడీపీ నేతలు గ్రహించాలన్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన హోంమంత్రి అనిత తన బాస్ల మెప్పు కోసం ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం విజ్ఞత కాదని, తప్పుడు విమర్శలు మానుకోవాలన్నారు. జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రజలు పునరాలోచనలో పడడం టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదన్నారు. అమరావతి రాజధాని పేరిట రూ.లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ దందాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారన్నారు.


