సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వైద్యానికి ఆర్థిక సాయం చేసి, తన ఊపిరి నిలపాలంటూ రాజమహేంద్రవరంలోని తాడితోట ఇందిరానగర్కు చెందిన 38 ఏళ్ల చికిలే దుర్గాదేవి.. దాతలను కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. దుర్గాదేవికి భర్త దైవ సహాయం, ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె సుమణి ఉన్నారు. ఆమెకు 2022 మార్చిలో విపతీరమైన దగ్గు వచ్చింది. స్థానికంగా వైద్యులకు చూపించగా ఆస్తమాగా నిర్ధారించి ఏడాదిన్నర పాటు చికిత్స అందించారు. నయం కాకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లగా, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు సూచించారు.
ఆక్సిజన్ సిలిండర్ సాయంతోనే..
దుర్గాదేవి ఊపిరితిత్తులు 80 శాతం మేర గట్టిపడి 20 శాతమే పనిచేస్తున్నాయి. ఏడాదిగా ఆక్సిజన్ సిలిండర్ సాయంతో నెట్టుకొస్తున్నారు. కృత్రిమ శ్వాస లేకపోతే శరీరంతో ఆక్సిజన్ స్థాయి 60 శాతానికి పడిపోతోంది. చివరికి కాలకృత్యాలకు వెళ్లినా కృత్రిమ శ్వాస ఉండాల్సిందే. ఈ కారణంగా మంచానికే పరిమితమైన దుర్గాదేవికి ఆమెకు భర్త, కుమార్తె, తల్లి సపర్యలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఓ ప్రముఖ ఆసుపత్రిని సంప్రదించగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సకు దాదాపు రూ.46 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ప్రస్తుతం జీవన్ధాన్లో ఆమె పేరు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే కొందరు దాతలు రూ.8,71,816 సాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిఽధి నుంచి రూ.10,80,210 చికిత్స నిమిత్తం అందించారు. మిగిలిన మొత్తం కోసం ఆమె దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం అందించే దాతలు మరిన్ని వివరాలకు 80080 01706 నంబర్ను సంప్రదించాలి.


