అన్నవరం: రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారికి సౌకర్యాలు కల్పించడంలో వెనుకాడే దేవస్థానం అధికారులు.. ప్రజాప్రతినిధులు వస్తే మాత్రం రాచమర్యాదలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సత్యదేవుని ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో నేల వేడెక్కడంతో నడవాలంటే కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆలయ ప్రాంగణంలో నేలపై పర్చడానికి కొత్త కార్పెట్లు ఆలయంలో ఉన్నాయి. కానీ వాటిని వినియోగించకపోవడంతో ఈనెల ఎనిమిదో తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘కాళ్లు కాలుతున్నా కార్పెట్లు బయటకు తీయరా’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. అయినా అధికారులు స్పందించలేదు. కానీ.. ఆదివారం దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నవరం దేవస్థానానికి రావడంతో కొత్త కార్పెట్లను బయటకు తీశారు. ఆలయ ప్రాంగణంతో పాటూ మంత్రి పర్యటించిన ప్రతి చోటా వీటిని పరిచేశారు.
మంత్రి రాకతో దేవస్థానం
అధికారుల హడావుడి
ఆలయ ప్రాంగణంలో కొత్త కార్పెట్ల ఏర్పాటు
ఇన్నాళ్లూ భక్తులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని వైనం


