● సుమారు రూ.10 లక్షలు ఉంటుందని సమాచారం
● స్వాధీనం చేసుకున్న అధికారులు
సాక్షి, టాస్క్ఫోర్స్: పెదపూడి మండలం కై కవోలు గ్రామంలోని ఓ టీడీపీ నేత ఇంట్లో సుమారు రూ.10 లక్షల విలువైన భారీ బాణసంచా నిల్వలు బయటపడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పెదపూడి తహసీల్దార్ పీవీ సీతాపతిరావు, ఎస్సై ఎస్.తులసీరామ్, కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆదివారం దాడి చేసి వీటిని గుర్తించారు. కై కవోలు రామాలయం వీధిలోని టీడీపీ నేత ఇనపకోళ్ల వీర వెంకట సత్యనారాయణకు చెందిన ఇంట్లో 47 బాక్సుల్లో ఉన్న ఈ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో వాటి విలువ రూ.5 లక్షలుగా చెబుతున్నప్పటికీ రూ.10 లక్షలు ఉంటుందని సమాచారం. స్వాధీనం చేసుకున్న వాటిలో 5000 వాలా 62 షాట్స్, తారాజువ్వలు ఉన్నాయి. వీర వెంకట సత్యనారాయణ ఇంట్లో అదే గ్రామానికి చెందిన గోపిశెట్టి మణికంఠస్వామి వీటిని ఉంచినట్లు అధికారులు తెలిపారు. మణికంఠస్వామి కూడా టీడీపీ నాయకుడు కావడం గమనార్హం. కాగా.. ఇటీవల వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనతో బాణసంచా తయారీని చంద్రబాబు ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెందిన నాయకులే అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


