అనపర్తి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగు రోజుల నిరసన శనివారం కూడా కొనసాగింది. స్థానిక ఏరియా ఆస్పత్రి వైద్య ఆరోగ్య సిబ్బంది ప్లకార్డులు, డిమాండ్లతో కూడిన బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీని వేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్, 35 రోజుల సాధారణ సెలవులు అమలు చేయాలని తదితర డిమాండ్లు చేశారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, కౌన్సిలర్ చైతన్యరాజు, రేడియో గ్రాఫర్ విజయకుమార్, ల్యాబ్ టెక్నీషియన్ క్రాంతి, ఫార్మసిస్ట్ మీనా తదితర సిబ్బంది పాల్గొన్నారు.
అప్పనపల్లిలో భక్తుల రద్దీ
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వా మివారి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. వైనతేయ నదిలో పుణ్య స్నానా లు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని, ము డుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2,69,006 ఆదాయం వచ్చింది. స్వామి వారి నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.94,812 విరాళంగా అందించారు. స్వామి వారిని 6,400 మంది భక్తులు దర్శించుకున్నారు. 2,600 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు.
ఏలేరులో తగ్గుతున్న
నీటి నిల్వలు
ఏలేశ్వరం: వేసవి ఎండలు తీవ్రమవుతుండడంతో ఏలేరు జలశయంలో నీటినిల్వలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి నీటి సరాఫరా అంతంతమాత్రంగా ఉండడంతో దిగువ ఆయకట్టుకు నీటి సరఫరా తగ్గించారు. శనివారం నాటికి ప్రాజెక్టులో రూ.86.56 మీటర్లకు 77.38 మీటర్లు, 24.11 టీఎంసీలకు 10.58 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి దిగువ ఆయకట్టుకు 600, విశాఖకు 225, పంపాకు 50 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి సరఫరా నిలిపివేశారు.
సీతారామ సత్రానికి
రూ.5 లక్షల విరాళం
తొలి విడతగ రూ.2.6 లక్షల అందజేత
అన్నవరం: రత్నగిరిపై నూతనంగా నిర్మించనున్న సీతారామ సత్రంలో ఒక గది నిర్మాణానికి కర్నూలుకు చెందిన ఎల్.రవీంద్రారెడ్డి దంపతులు రూ. ఐదు లక్షల విరాళాన్ని శనివారం ప్రకటించారు. రూ. 11.40 కోట్లు వ్యయంతో 105 గదులతో నిర్మించనున్న సత్రానికి ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కాగా శనివారం దాత రవీంద్రారెడ్డి సత్యదేవుని దర్శించి పూజల అనంతరం ఆయన ప్రకటించిన విరాళంలో తొలి విడత రూ.2.6 లక్షల చెక్కును దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.రామకృష్ణకు అందజేశారు. డోనార్ స్కీం కింద సత్రంలో 15వ నంబరు గదిని దాతకు కేటాయించనున్నట్టు ఈఈ తెలిపారు.


