దరఖాస్తులకు ఈ నెల 15వ తేదీ తుది గడువు
రాయవరం: రెండేళ్ల ఉపాధ్యాయ శిక్షణ కోర్సులో ప్రవేశానికి ఏపీ డీఈఈ సెట్–2026 నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులోని డైట్ కళాశాలతో పాటుగా, కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందడానికి అవకాశముంది. గత నెల 31 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా, ఈ నెల 15 తుది గడువు విధించారు. ఈ పరీక్షకు రూ.వెయ్యి ఫీజు చెల్లించి హెచ్టీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ లేదా హెచ్టీటీపీఎస్://ఏపీడీఈఈసెట్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పరీక్షా కేంద్రాలను కేటాయిస్తారు.
అర్హతలివీ
విద్యార్థుల వయసు ఈ ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. భారత జాతీయుడై ఉండాలి. పది, ఇంటర్మీడియెట్ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్లో 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
● చక్కటి అవకాశం
ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే వారికి ఇది ఒక చక్కని అవకాశం. ప్రభుత్వ డైట్తో పాటుగా ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో సీటు పొందడానికి డీసెట్ రాయాల్సి ఉంది.
–జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ,
కాకినాడ.


