రాజమహేంద్రవరం సిటీ: నగరంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోత్సాహంతో నిర్మించిన అక్రమ కట్టడాలను హైకోర్టు ఆదేశాలు అమలు చేసి కూల్చివేయాలని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపి, అనంతరం ర్యాలీ నిర్వహించి మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ దేవీచౌక్ సెంటర్లోని జిల్లా పశువుల ఆస్పత్రి ఎదురుగా గౌతమి సూపర్ బజార్ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చి వేయాలన్నారు. గౌతమి సూపర్ బజార్ విషయంలో తాను రూ.ఐదు కోట్ల ముడుపులు తీసుకున్నానంటూ గత ఎన్నికల సమయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ అబద్ధపు ప్రచారం చేసి, వేల పోస్టర్లను నగరంలో వెదజల్లించి, నీచ రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు తెచ్చుకుని నా నిజాయితీ, సచ్చీలత నిరూపించుకున్నాననన్నారు. అక్రమ నిర్మాణాలు జరిగినా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నోరు విప్పక పోవడంతో ముడుపులు తీసుకున్నది ఎవరో ఇప్పుడు స్పష్టంగా ప్రజలకు తెలిసిపోయిందన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, కోర్టు ఆదేశాలు గౌరవించాలని, లేనిపక్షంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్తి లక్ష్మి, కాటం రజనీకాంత్, దాసి వెంకటరావు, మార్తి నాగేశ్వరరావు, మజ్జి అప్పారావు, పీతా రామకృష్ణ, బిల్డర్ చిన్నా, వాసంశెట్టి గంగాధర్, గుత్తుల హర్ష, రొక్కం త్రినాథ్, కృష్ణవేణి, పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, వార్డు ఇన్చార్జులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి
ఫ మాజీ ఎంపీ భరత్రామ్,
డాక్టర్ శ్రీనివాస్
ఫ రాజమహేంద్రవరంలో నిరసన, ర్యాలీ


