
రయ్ రయ్..
●
● చివరి దశకు చేరుకున్న
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు
● దేవరపల్లి – ఖమ్మం మధ్య 162 కిలోమీటర్ల మేర నిర్మాణం
● రూ.4,609 కోట్లతో నిర్మిస్తున్న కేంద్రం
● విశాఖ – హైదరాబాద్ మధ్య
తగ్గనున్న దూరం
● 8 నెలల్లో అందుబాటులోకి..
దేవరపల్లి: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరో మూడు కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి కావలసి ఉంది. 2022 ఏప్రిల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, నాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికే దీని నిర్మాణం పూర్తి కావలసి ఉండగా, అధిక వర్షాలు, భూసేకరణలో ఇబ్బందుల వల్ల జాప్యం జరిగింది. ఈ హైవే మరో 8 నెలల్లో అందుబాటులోకి రానున్నదని అధికారులు చెబుతున్నారు.
ఇదీ ప్రయోజనం
ప్రస్తుతం విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే విజయవాడ మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీనికి 13 గంటల సమయం పడుతోంది. అదే గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా అయితే కేవలం 8 గంటల్లోనే హైదరాబాద్ చేరుకోవచ్చని హైవే అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకూ దాదాపు 162 కిలోమీటర్ల పొడవున పూర్తిగా పచ్చని పంట పొలాల మధ్య నుంచి ఈ హైవే నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం వల్ల విశాఖ నుంచి హైదరాబాద్కు విజయవాడ వెళ్లకుండానే నేరుగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది. విశాఖ – హైదరాబాద్ మధ్య సుమారు 125 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. దేవరపల్లి వద్ద తల్లాడ హైవేకి 2 కిలోమీటర్ల దూరాన డైమండ్ జంక్షన్ వద్ద గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రారంభమవుతుంది. విశాఖపట్నం వైపు నుంచి వచ్చే వారు 16వ నంబర్ జాతీయ రహదారిపై దేవరపల్లికి చేరుకుని, అక్కడి నుంచి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా హైదరాబాద్కు సులువుగా చేరుకోవచ్చు. ఈ రహదారి దాదాపు ఎక్కడా మలుపులు లేకుండా సాగుతుంది.
రూ.4,609 కోట్లతో..
దేవరపల్లి నుంచి ఖమ్మం వరకూ రూ.4,609 కోట్ల వ్యయంతో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టారు. దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 53.8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.2,200 కోట్లు మంజూరు చేసింది. ఈ రోడ్డు కోసం 1,996 ఎకరాల భూములు సేకరించారు. మన రాష్ట్రంలో రెండు ప్యాకేజీలుగా దీని పనులు జరుగుతున్నాయి. మొదటి ప్యాకేజీ కింద మొత్తం 27.4 కిలోమీటర్ల పనులూ పూర్తయ్యాయి. రెండో ప్యాకేజీలో 29.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టగా, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద 3 కిలోమీటర్లు మినహా మిగిలిన పనులు పూర్తి చేశారు. పొంగుటూరుకు చెందిన రైతు కోర్టుకు వెళ్లడంతో మూడెకరాల భూసేకరణ నిలిచిపోయింది.

రయ్ రయ్..

రయ్ రయ్..

రయ్ రయ్..