రాజమహేంద్రవరం రూరల్: రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఓ పోస్టులు తగ్గించడం అన్యాయమని ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వీఆర్ఓల సమస్యలపై అసోసియేషన్ జిల్లా నేతలు డీఆర్ఓ టి.సీతారామమూర్తికి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సానా శ్రీను, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వాడ్రేవు లక్ష్మీప్రసన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మంగి అప్పలనాయుడు మాట్లాడుతూ, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,500 మంది వీఆర్ఓలను మిగులుగా చూపడం సరికాదని అన్నారు. రేషనలైజేషన్తో నిమిత్తం లేకుండా పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి ఒక వీఆర్ఓను నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులతో సంప్రదించకుండా, రాష్ట్ర వీఆర్ఓ సంఘాల నాయకులతో చర్చించకుండా, గ్రామ, వార్డు సచివాలయాల అధికారుల సలహా మేరకు జీఓ నంబర్ 1, 2, 3, 4, 5 ఏకపక్షంగా విడుదల చేయడాన్ని తప్పు పట్టారు. దీనిని పునఃపరిశీలించాలన్నారు. సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియ నుంచి వీఆర్ఓలకు మినహాయింపు ఇవ్వాలని, అర్హులైన వారికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.
యోగా పోటీల్లో రాష్ట్రస్థాయి
విజేతలకు అభినందన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16, 17 18 తేదీల్లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాజమహేంద్రవరానికి చెందిన తండ్రీకొడుకులు ప్రతిభ చూపారు. యోగా గురువు కర్రి నాగ వెంకట శ్రీధర్ యోగా షార్ట్ ఫిల్మ్ పోటీల్లో 35 సంవత్సరాలు పైబడిన విభాగంలో యోగా షార్ట్ ఫిల్మ్ పోటీల్లో ద్వితీయ, యోగా ఫొటోగ్రఫీ పోటీలో తృతీయ స్థానాలు సాధించారు. ఆయన కుమారుడు కార్తీక్ రామచంద్ర 10 నుంచి 18 సంవత్సరాల విభాగంలో ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రథమ, షార్ట్ ఫిల్మ్ పోటీల్లో తృతీయ స్థానాలు సాధించాడు. వారిద్దరినీ కలెక్టర్ పి.ప్రశాంతి కలెక్టరేట్లో గురువారం సాయంత్రం అభినందించారు. వారికి అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఆయుష్ అధికారులు కూడా పాల్గొన్నారు.
వీఆర్ఓ పోస్టుల తగ్గింపు అన్యాయం