స్ఫూర్తిప్రదాత ఫూలే
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సమాజంలో చైతన్యం తీసుకుని రావడం ద్వారా మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తిప్రదాతగా నిలిచారని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, దేశంలో మహాత్మా అని గాంధీజీని, ఫూలేను మాత్రమే పిలుచుకుంటామని అన్నారు. వారికి సమాజం ఇచ్చిన గౌరవానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందని అణగారిన వర్గాల కోసం పోరాడిన మహనీయుడు ఫూలే అని అన్నారు. వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందడానికి చదువు ఎంతో అవసరమని చాటిచెప్పారన్నారు. సీ్త్ర విద్యను ప్రోత్సహిస్తే కుటుంబం, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఆచరణలో చూపించిన వ్యక్తి జ్యోతిరావ్ ఫూలే అని కలెక్టర్ ప్రశాంతి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. ఫూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిమ ప్రతిభ చూపిన 110 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఫూలే సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యాన రూ.1.10 లక్షలు, బీసీ కార్పొరేషన్ ద్వారా 144 మంది బీసీ, కాపు, ఈబీసీ వర్గాల లబ్ధిదారులకు రూ.352 లక్షల చొప్పున స్వయం ఉపాధి పథకాల అమలుకు ఆర్థిక సహాయం అందించామని కలెక్టర్ తెలిపారు.
చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్
రాజమహేంద్రవరం రూరల్: ఐ–టీడీపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మీడియా ముందు చేబ్రోలు కిరణ్తో మాట్లాడించడం, తప్పు అని చెప్పడం, క్షమాపణ కోరడం, అరెస్టు చేయడం అన్నీ చంద్రబాబు, ఐ–టీడీపీ స్క్రిప్ట్లో భాగమేనని పేర్కొన్నారు. టీడీపీ అనుకూల మీడియాలో డిబేట్లు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందని అన్నారు. మహాశక్తి లాంటి వైఎస్ జగన్ను అడ్డుకునేందుకు అబద్ధాలు ప్రచారం చేయడంతో పాటు, ఆయన కుటుంబంపై దారుణ వ్యాఖ్యలు చేయడం ద్వారా వారిని మనోవేదనకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడులో వైఎస్ జగన్కు సరైన భద్రత కల్పించలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రజలు అన్ని విషయాలూ గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. ఇప్పటికై నా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మాని, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని వేణు హితవు పలికారు.
షార్ట్టర్మ్ ఇంటర్న్షిప్నకు
దరఖాస్తుల ఆహ్వానం
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన సమ్మర్ ఆన్లైన్ షార్ట్టర్మ్ ఇంటర్న్షిప్ కార్యక్రమం–2025 ప్రారంభిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వీజీడీ మురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడు, నాలుగో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామన్నారు. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ శాఖల విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రెండు నెలల పాటు కొనసాగే ఈ ఇంటర్న్షిప్లో 80 గంటల థియరీ, 40 గంటల ప్రాక్టికల్ తరగతులు నిర్వహిస్తారని వివరించారు. ప్రధాన కోర్సుల్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్ పైథాన్, డిజంగో వెబ్ డెవలప్మెంట్, ఎంబెడెడ్ సిస్టమ్స్, యూనిటీ 3డీ గేమింగ్ డిజైన్, కాటియా ఎక్స్పర్ట్ డిజైన్ రెవిట్ ఆర్కిటెక్చర్ మోడలింగ్ తదితర కోర్సులలో నైపుణ్యం పెంచేందుకు ఆన్లైన్లో ఈ శిక్షణ ఇస్తారని మురళి తెలిపారు. రోజువారీ క్విజ్లు, వారానికోసారి అసెస్మెంట్లు, ప్రాజెక్ట్ సమీక్ష కూడా ఉంటాయని పేర్కొన్నారు. శిక్షన విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీఎస్ఎస్డీసీ నుంచి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.1,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు. తొలి విడత ఇంటర్న్షిప్ ఈ నెల 28న, రెండో విడత మే 12న ప్రారంభిస్తారని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు https://naipunyam.ap.gov.in/user®istration?page=online&short&term& internship వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 99888 53335, 87126 55686, 87901 18349, 87901 17279 మొబైల్ నంబర్లలో ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకూ సంప్రదించవచ్చని మురళి తెలిపారు.
స్ఫూర్తిప్రదాత ఫూలే


