ప్రశాంతంగా ఉండే ఊళ్లో మారణహోమం.. అర్ధరాత్రి పెంకుటింట్లో.. | Unknown Persons Assasinated Mother And Childrens Karnataka | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఉండే ఊళ్లో మారణహోమం.. అర్ధరాత్రి పెంకుటింట్లో..

Feb 7 2022 4:19 AM | Updated on Feb 7 2022 5:32 AM

Unknown Persons Assasinated Mother And Childrens Karnataka - Sakshi

హత్యలు జరిగిన ఇంటి వద్ద పోలీసులు

మండ్య: ఒక పెంకుటింట్లో రక్తపాతం చోటుచేసుకుంది. ఇంటి యజమాని లేని సమయంలో భార్య, నలుగురు పిల్లలను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఈ దుర్ఘటన మండ్య జిల్లా శ్రీరంగ పట్టణం తాలూకాలోని కేఆర్‌ఎస్‌ గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగు చూసింది. స్థానికులు, శ్రీరంగ పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. హత్యకు గురైన వారు కేఆర్‌ఎస్‌ గ్రామంలో నివాసముంటున్న లక్ష్మి (26), ఆమె సంతానం రాజ్‌ (12), గోవింద్‌ (11), కోమల్‌ (7), కునాల్‌ (4)గా గుర్తించారు. రోల్డ్‌గోల్డ్‌ నగలు అమ్ముతూ, ఆభరణాలను పాలిష్‌ చేస్తూ గంగారామ్‌– లక్ష్మి దంపతులు జీవిస్తున్నారు. గంగారామ్‌ పని మీద రెండు రోజుల క్రితం తమ సొంత ఊరు అయిన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాడు. లక్ష్మి శనివారం ఎప్పటిలాగే వ్యాపారం ముగించుకొని ఇంటికి చేరుకుని రాత్రి భోజనం చేసి పడుకున్నారు.  

ఎస్పీ, ఐజీపీ పరిశీలన అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. కత్తులు వంటి మారణాయుధాలతో లక్ష్మిని, ఆమె పిల్లలను నరికి ప్రాణాలు తీశారు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు కిటికీలో నుంచి చూడగా ఘోరం బయటపడింది. ప్రశాంతంగా ఉండే ఊళ్లో మారణహోమం జరిగేసరికి కేఆర్‌ఎస్‌ గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ వార్త విని చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. శ్రీరంగ పట్టణ పోలీసులు, జిల్లా ఎస్‌పి ఎన్‌.యతీష్, దక్షిణ విభాగం ఐజీపీ మధుకర్‌ పవార్‌ సంఘటనాస్థలిని పరిశీలించి ఆధారాలను సేకరించారు. భర్తను కూడా పిలిపించి విచారించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement