చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా | Transporting ganja in the form of chocolates | Sakshi
Sakshi News home page

చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా

Dec 30 2024 3:30 AM | Updated on Dec 30 2024 3:30 AM

Transporting ganja in the form of chocolates

ఆరుగురు ముఠా సభ్యుల అరెస్ట్‌

కోదాడ రూరల్‌: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌కు చాక్లెట్ల రూపంలో గంజాయి తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను సూర్యాపేట జిల్లా కోదాడ ఎక్సైజ్‌ పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. ఎక్సైజ్‌ సీఐ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌లో అంతర్‌ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద ఎక్సైజ్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సును ఆపారు. 

బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన భువనేశ్వర్‌లోని మయూర్‌బంజ్‌కు చెందిన అనిల్‌కుమార్, రజని, బంకిమ్‌చంద్ర, మమితనాయక్, సంజిబాని దెబురాయ్, జానునాయక్‌ను కిందకు దింపి వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, 25 ప్యాకెట్లలో 5 కేజీల బరువున్న వెయ్యి గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి. ఆరుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎౖక్సైజ్‌ సీఐ తెలిపారు. 

ఈ ఆరుగురు నిందితులు హైదరాబాద్‌లో పనిచేస్తుంటారు. ట్రావెల్స్‌ బస్సు ఏపీలోకి ప్రవేశించిన తర్వాత పలాసలో అక్కడి పోలీసుల తనిఖీ చేసినప్పటికీ వాటిని ఆయుర్వేదిక్‌ చాక్లెట్లుగా వారిని నమ్మించి బయటపడ్డారు. బస్సు తెలంగాణలోకి ప్రవేశించే మార్గంలో రామాపురం క్రాస్‌రోడ్‌లో కోదాడ ఎక్సైజ్‌ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement