మొండెం మధ్యప్రదేశ్‌లో.. తల బెంగళూరులో..

Torso Found In Madhya Pradesh And Head In Bangalore - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో రైలు పట్టాలపై లభించిన మొండెం తాలూకూ తల బెంగళూరులో దర్శనమిచ్చింది. రైలు ఇంజన్‌లో ఇరుక్కున్న తల దాదాపు 1300 కిలోమీటర్లు ప్రయాణించి బెంగళూరు రైల్వే స్టేషన్‌లో చిక్కింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అక్టోబర్‌ 3వ తేదీన మధ్యప్రదేశ్‌, బెతుల్‌ రైల్వే స్టేషన్‌లోని పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మొండెం లభించింది. అయితే తల, మరి కొన్ని ఇతర భాగాలు కనిపించకపోవటంతో అతడి ఆచూకీ తెలుసుకోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 4న రైలు ఇంజన్‌కు చిక్కుకుని ఉన్న తలను బెంగళూరు రైల్వే స్టేషన్‌ సిబ్బంది గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ( ‘అవి రక్తపు మరకలు కాదు పెయింట్‌’ )

తలను ఫొటో తీసి విచారణ చేయగా.. తల లేని మొండెం ఒకటి మధ్యప్రదేశ్‌, బతుల్‌ రైల్వే స్టేషన్‌లో దొరికినట్లు బెంగళూరు పోలీసులకు తెలియవచ్చింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు‌ చేరుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేయగా సదరు విడి భాగాలు బతుల్‌కు చెందిన 28 ఏళ్ల రవి మర్కామ్‌కు చెందినవిగా తేలింది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు అతడి తల మీదనుంచి వెళ్లటం కారణంగా అతడు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top