దారి ఇస్తావా.. చస్తావా: ఫారెస్టు అధికారికి టీడీపీ నేతల బెదిరింపులు | Sakshi
Sakshi News home page

దారి ఇస్తావా.. చస్తావా: ఫారెస్టు అధికారికి టీడీపీ నేతల బెదిరింపులు

Published Sun, Sep 12 2021 4:03 AM

TDP leaders threaten Forest Officer - Sakshi

నిమ్మనపల్లె (చిత్తూరు జిల్లా): అటవీ భూమిలో తమ పొలానికి దారి ఇవ్వకపోతే చంపుతామని ఫారెస్టు అధికారిని బెదిరించిన వ్యవహారంలో టీడీపీ చిత్తూరు జిల్లా  కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్‌జీ వెంకటేష్, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిమ్మనపల్లె మండలం ఆచార్లపల్లెకు చెందిన ఆర్‌జే వెంకటేష్, గొల్లపల్లెకు చెందిన సిరసాని క్రిష్ణమూర్తి, సిరసాని చెన్నకేశవులకు నూరుకుప్పల కొండ, రిజర్వుఫారెస్టుకు మధ్య సర్వే నం.239లో పట్టాభూమి ఉంది. అటవీ రికార్డుల ప్రకారం పట్టాభూమికి సర్వే నం.222 నుంచి 3 అడుగుల వెడల్పుతో కాలిబాట ఉంది. రైతులు క్రిష్ణమూర్తి, చెన్నకేశవులు ఈ దారి గుండా తమ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

ఆర్‌జే వెంకటేష్‌ టీడీపీ హయాంలో తన రాజకీయ పలుకుబడితో సర్వే నం.234 నుంచి అక్రమంగా రిజర్వుఫారెస్టులో 2కి.మీ రోడ్డు ఏర్పాటు చేసి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అటవీ భూమి, సంపద, పరిరక్షణలో భాగంగా ఫారెస్టు అధికారులు 2018లో రెడ్డివారిపల్లె, రాచవేటివారిపల్లె సమీపంలో కందకాలు తవ్వించారు.  వెంకటేష్‌ ఏర్పాటు చేసుకున్న దారి  మూసుకుపోయింది.

అప్పటి నుంచి ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌కు వేధింపులు మొదలయ్యాయి. విధులను అడ్డగిస్తూ, దారి ఇవ్వపోతే చంపేస్తామంటూ బెదిరిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులు, అనుకూల మీడియాలో వార్తలతో వేధిస్తున్నారు. శుక్రవారం విధుల్లో భాగంగా ఫారెస్టు అధికారి ప్రకాష్‌ వెళ్లగా వెంకటేష్, రెడ్డెప్ప చంపేస్తామంటూ బెదిరించడంతో అటవీ అధికారుల ఆదేశాలతో ప్రకాష్‌  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement
Advertisement