ఆశ చూపి.. బాలికల అమ్మకం

Police Arrested A Gang Of Selling Girls In The Hope Of Giving Jobs - Sakshi

బాలికను రూ.లక్షకు విక్రయించిన దుండగులు

నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

సాక్షి, భువనేశ్వర్: ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ పెట్టి బాలికలను విక్రయించే ఓ ముఠా పోలీసులకు చిక్కింది. ఆ ముఠాలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. నవరంగపూర్‌ జిల్లా ఉమ్మరకోట్‌ ప్రాంతం సునాబెడ గ్రామానికి చెందిన బాలికకు పని కల్పిస్తామని తల్లిదండ్రులను నమ్మించి తీసుకువెళ్లిన దుండగులు ఆ బాలికను వేరే వ్యక్తికి లక్షరూపాయలకు అమ్మివేశారు. ఆ బాలిక చాకచక్యంగా తప్పించుకుని ఇంటికి చేరింది. ఆలస్యంగా వెలుగుచూసిన  ఈ అమానుష సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మరకోట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన మంగళ సింగ్‌ హరిజన్, మొణిత కుమార్‌లు సునాబెడ గ్రామానికి చెందిన బాలికకు పనులు ఇప్పిస్తామని తల్లి దండ్రులను ప్రలోభపెట్టి గత ఏడాది ఆగస్టు 8 వ తేదీన తమతో నవరంగపూర్‌ తీసుకువెళ్లారు. నవరంగపూర్‌లోని తోటవీధికి చెందిన నిర్మల సున, బసంత సున, జమున బాగ్, పూర్ణశాంత అనే మహిళలకు బాలికను అప్పగించి వెళ్లిపోయారు.

ఆ బాలిక దాదాపు 3 నెలలు అక్కడే ఉంది. అనంతరం ఆ మహిళలు బాలికను ఢిల్లీ తీసుకు వెళ్లి ఒక వ్యక్తితో వివాహం చేశారు. ఆ వ్యక్తి నిందిత మహిళలకు లక్షరూపాయలు అందజేశాడు. డబ్బులు చేతికి అందిన తరువాత నిందిత మహిళలు నవరంగపూర్‌ తిరిగి వచ్చేశారు. ఆ వ్యక్తి వేధింపులు తాళలేక ఈ నెల 14 వ తేదీన బాలిక  తప్పించుకుని అతి కష్టంపై ఉమ్మరకోట్‌ చేరుకుంది. ఈ విషయం తెలిసిన నిందిత మహిళలు ఈ నెల 21వ తేదీన బాలిక గ్రామానికి వచ్చి ఢిల్లీ తీసుకు వెళ్తామని, తమతో రమ్మని బలవంతం పెట్టారు. వారితో వెళ్లేందుకు బాలిక నిరాకరించి తనను లక్ష రూపాయలకు అమ్మివేశారని తల్లిదండ్రులకు వెల్లడించింది. ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు అవాక్కయ్యారు. నిందితులపై ఆగ్రహించి బంధించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి సంఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ అమానుష సంఘటన జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేసింది.  

చదవండి: ప్రియురాలి యాసిడ్‌ దాడి, ప్రియుడి మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top