ముగ్గురి గల్లంతు.. గాలిస్తున్న సహాయక బృందాలు
మల్కన్గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా జలాశయంలో నాటు పడవ బోల్తాపడి ముగ్గురు గల్లంతయ్యారు. వివరాలిలా ఉన్నాయి. సమితిలోని ఓండ్రాపల్లి పంచాయతీ ఓరపొదర్ గ్రామానికి చెందిన 8 మంది వ్యక్తులు, అదే పంచాయతీ దామోదర బేడ గ్రామానికి చెందిన గోపాల్ ముదులి (45), కుమార్తె జమున ముదులి, మూడేళ్ల మనుమడు కోరుకొండ సమితిలోని నక్కమమ్ముడి పంచాయతీ భకులి గ్రామానికి నాటు పడవలో వస్తున్నారు.
అయితే పడవలో బరువు ఎక్కువ కావడంతో జలాశయం మధ్యలో బోల్తాకొట్టింది. దీంతో గోపాల్ ముదులి, జయ ముదులి, మూడేళ్ల బాలుడు గల్లంతయ్యారు. పడవలో ఉన్న మిగిలిన 8 మంది ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరిన వారి సమాచారం అగ్నిమాక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. చీకటి పడడంతో వారి ఆచూకీ తెలియరాలేదు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులు ఉండడంతో ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.