
రాకేష్(ఫైల్)
సాక్షి, గార్ల(జయశంకర్ భూపాలపల్లి) : అత్తామామల వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన అల్లుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా గార్లలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం బజార్కు చెందిన బరిబద్దల రాకేష్(26)కు నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన స్నేహతో ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన నాటి నుంచి అత్తామామలు మునీందర్, రేణుకతో పాటు ఇతర బంధువులు రాకేష్ను వేధిస్తున్నారు.
ఏం పనిచేయకుండా జులాయిగా తిరుగుతూ భార్యను ఎలా పోషిస్తావంటూ ఫోన్లో మానసికంగా వేధించేవారు. దీంతో రాకేష్ బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మృతుడు రాకేష్ భార్య స్నేహ ఇరవై రోజుల క్రితమే బాబుకు జన్మనిచ్చింది. మృతుడి తండ్రి రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై డి.నాగేశ్వరరావు తెలిపారు.