Man Abduct Girl Tragedy In Warangal - Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ పరిచయం.. మైనర్‌ బాలికను ట్రాప్‌ చేసి..

Published Thu, Jul 22 2021 9:53 AM

Man Abduct Girl Tragedy In Warangal - Sakshi

సాక్షి, పర్వతగిరి(వరంగల్‌): మైనర్‌ బాలికను ఫేస్‌బుక్‌ ద్వారా ట్రాప్‌ చేసిన యువకుడిని అరెస్టు చేసినట్లు మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్‌ బాలిక ఈ నెల 7న అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యుల ఇళ్లలో వెతికినా బాలిక ఆచూకి లభించకపోవడంతో ఈనెల 8వ తేదీన బాలిక తండ్రి నాగరాజు ఫిర్యాదు చేశాడు.

విచారణలో ఇరువురు యువకులను విచారించగా కేసుకు ఎలాంటి సంబంధం లేనట్లు గుర్తించామన్నారు. ఇదే క్రమంలో తిరుపతికి చెందిన పైడి రాజశేఖర్‌ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమై ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను ట్రాప్‌ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. రాజశేఖర్‌ మైనర్‌ బాలికను తిరుపతికి రప్పించుకుని తన వద్దే బాలికను దాచి పెట్టాడు. ఈ క్రమంలో బాలిక వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి సదరు బాలిక తిరుపతిలోనే ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని, చైల్డ్‌హోంకు పంపినట్లు తెలిపారు.

కాగా, తన కూతురు ఆచూకి లభించడం లేదని మనస్తాపానికి గురైన బాలిక తండ్రి నాగరాజు ఈనెల 16న క్రిమిసంహారక మందు తాగి మృతి చెందడం బాధాకరమన్నారు. బాలికను గుర్తించి పట్టుకున్న సీఐ విశ్వేశ్వర్, ఎస్సై నవీన్, ట్రెయినీ ఎస్సై శ్వేతలను అభినందించారు.   

Advertisement
Advertisement