Huzurabad Bypoll: Leaders Distribution Money To Influence Voters Cases - Sakshi
Sakshi News home page

కోట్లు పట్టుకుని.. మళ్లీ ఇచ్చేశారు!: విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడి

Published Fri, Dec 17 2021 10:20 AM

Huzurabad Bypoll: Leaders  Distribution Money To Influence Voters Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో దొరికిన డబ్బునంతా దాదాపు తిరిగి ఇచ్చేశారు. నమోదు చేసిన పోలీస్‌ కేసుల పరిస్థితి సైతం బుట్టదాఖలయ్యాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీ – కేసుల నమోదు తదితర అంశాలపై సుపరిపాలనా వేదిక సేకరించిన సమాచారంలో విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడైయ్యాయి.

ఈ మేరకు ఫోరం కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి పద్మనాభరెడ్డి గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ)కు లేఖ రాస్తూ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ విఫలమైన తీరుపై తీవ్ర అంసతృప్తిని వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికను ఒక కేస్‌ స్టడీగా తీసుకుని ఎన్నికల్లో డబ్బు పాత్రను పూర్తిగా తగ్గించేందుకు వెంటనే తగు మార్గదర్శకాలు విడుదల చేయాలని పద్మనాభ రెడ్డి కోరారు. 

94 కేసులు నమోదు...
హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో అక్టోబర్‌1 నుంచి నవంబర్‌ 2 వరకు వివిధ ప్రాంతాల్లో రశీదులు లేని రూ.3.80 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని 94 కేసులు నమోదు చేశారు. ఇందులో కేవలం 18 లక్షలే కోర్టుకు సమర్పించి, మిగిలిన కేసుల్లో డబ్బంతా వాపస్‌ ఇచ్చేశారు.

94 కేసుల్లో కేవలం ఐదు కేసుల్లోనే అభియోగాలు నమోదు చేయగా, అందులో రెండు కేసులు పేకాటకు సంబంధిం చినవి కాగా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన డబ్బు పంపిణీకి సంబంధించి మూడు కేసుల్లో మాత్రమే అభియోగాలు నమోదు చేశారు.  

చదవండి: మోదీ జీ... ప్లీజ్‌ పెంచండి.. పోస్ట్‌కార్డ్‌ సందేశాల పవర్‌ ఇది!

Advertisement
Advertisement