సోదరుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు | Man Poured Petrol On His Brother And Set Him On Fire In Secunderabad, Details Inside - Sakshi
Sakshi News home page

సోదరుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు

Feb 12 2024 4:22 AM | Updated on Feb 12 2024 9:53 AM

He poured petrol on his brother and set him on fire - Sakshi

కంటోన్మెంట్‌(హైదరాబాద్‌): ఆస్తి తగాదాలతో వరుసకు సోదరుడైన ఒక వ్యక్తిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్‌ ప్రాంతంలోని బోయిన్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. 70 శాతం గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బోయిన్‌పల్లి కంసారిబజార్‌ రామమందిరం సమీపంలో కందికొండ సత్తయ్య, ముత్తయ్యలకు నివాసస్థలం ఉంది.

ముత్తయ్య కుమారుడు శ్రీనివాస్‌(62) ఇటీవల తన తండ్రి ద్వారా సంక్రమించిన స్థలంలో ఇంటినిర్మాణం చేపట్టి అద్దెకు ఇచ్చాడు. తాను సమీపబస్తీలో నివాసం ఉంటున్నాడు. కంసారి బజార్‌లో తన ఇంటి పక్కనే వరుసకు సోదరుడైన వినోద్‌ (సత్తయ్య కుమారుడు) మరో ఇంటిలో నివాసముంటున్నాడు. వీరిద్దరి ఇళ్ల నడుమ ఉన్న చిన్నపాటి సందు గుండానే శ్రీనివాస్‌ ఇంటికి దారి ఉంది. ఈ స్థలం విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది.

ఈ క్రమంలో ఆదివారం శ్రీనివాస్‌ అద్దె వసూలు నిమిత్తం తన ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా వినోద్‌ అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. తన అన్నను చంపానంటూ అరుస్తూ పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్‌లో శ్రీనివాస్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో శ్రీనివాస్‌ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement