ఏపీ మాజీమంత్రి పత్తిపాటి సతీమణిపై ఫిర్యాదు

Complaint Against AP Ex-Minister Prathipati Pulla Rao Wife - Sakshi

బంజారాహిల్స్‌: ఏపీ మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి తేనె వెంకాయమ్మపై భూకబ్జాకు సంబంధించి జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యదర్శి ఎ.మురళీముకుంద్‌ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 44లో తమ సొసైటీకి చెందిన భూమిని కబ్జా చేశారని జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఆదివారంరాత్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాట్‌ నంబర్‌ 853/ఎఫ్‌లోని 1,519 గజాల స్థలంపై కొంతకాలంగా వివాదం నడుస్తోందని, అది తమదేనంటూ వెంకాయమ్మ వాదించడమే కాకుండా ఆమె అనుచరులు సొసైటీకి చెందిన బోర్డును కూడా తొలగించారని ఆరోపించారు.

బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ స్థలాన్ని కబ్జా చేసేందుకు వెంకాయమ్మ, ఆమె అనుచరులు ప్రయత్నిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకో వాలని ఆయన కోరారు. అక్రమంగా ఈ ప్లాట్‌ పొందిన సీహెచ్‌ శిరీష దీనిని పి.శ్రీహరికి గిఫ్ట్‌ డీడ్‌ చేశారని, మళ్లీ శ్రీహరి 2020 డిసెంబర్‌ 31న ఎల్లోస్టోన్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా ఉన్న పత్తిపాటి వెంకాయమ్మకు ఏజీపీఏ చేసినట్లు తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్లాట్‌ వ్యవహారం అటు న్యాయ స్థానం లోనూ, ఇటు జూబ్లీహిల్స్‌ పోలీసుల విచారణలో ఉండగా తాజాగా వెంకాయమ్మ రంగప్రవేశంతో మరింత ఆసక్తికరంగా మారింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top