కేజిన్నర బంగారం దోపిడీ | Attack on woman gold theft | Sakshi
Sakshi News home page

కేజిన్నర బంగారం దోపిడీ

Apr 6 2023 5:37 AM | Updated on Apr 6 2023 5:37 AM

Attack on woman gold theft - Sakshi

గుడిపాల (చిత్తూరు జిల్లా): జనం చూస్తుండగానే ఓ మహిళపై దాడిచేసి.. బ్యాగ్‌లో ఉన్న కేజిన్నర బంగారాన్ని దుండగులు దోచుకెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వసంతాపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వసంతాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, ఉష దంపతులు గుడిపాలలో జ్యూవెలరీ దుకాణం నడుపుతున్నారు. వీరు ప్రతిరోజూ ఇంటి నుంచి బంగారాన్ని తీసుకుని దుకాణానికి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మిగిలిన ఆభరణాలను రాత్రివేళ ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్త చేస్తుంటారు.

బుధవారం రాత్రి 7:30 గంటలకు దుకాణం నుంచి కారులో బంగారు ఆభరణాలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటివద్ద వెనుక వైపున భర్త కారు పార్కింగ్‌ చేస్తుండగా.. ఉష బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌ పట్టుకుని నిలబడింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఉషపై దాడి చేశారు. ఆమె చేతిలో ఉన్న బంగారం బ్యాగ్‌ను గుంజుకుని పారిపోయారు. దీనిని గమనించిన భర్త, స్థానికులు ఆమె వద్దకు చేరుకోగా.. అప్పటికే దుండగులు పరారయ్యారు.

నిందితులు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో గల ద్విచక్ర వాహనంపై వచ్చారని స్ధానికులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల్ని వీలైనంత త్వరగా పట్టుకుంటామని డీఎస్పీ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుల జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, తమిళనాడు సరిహద్దులో వాహన తనిఖీ చేపట్టామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement