రీల్స్‌ పిచ్చి..! బాలికను రెండుసార్లు వివాహం భార్గవ్‌ | 15 year old girl two time marriage at visakhapatnam | Sakshi
Sakshi News home page

రీల్స్‌ పిచ్చి..! బాలికను రెండుసార్లు వివాహం భార్గవ్‌

Feb 9 2025 10:49 AM | Updated on Feb 9 2025 10:49 AM

 మైనర్‌ను ట్రాప్‌ చేసిన యువకుడు  

రెండుసార్లు వివాహం చేసుకున్న వైనం 

 భార్గవ్‌పై పోక్సో కేసు నమోదు  

 

 

సీతమ్మధార: సెల్‌ఫోన్లకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్న రోజులివి. రీల్స్‌ పిచ్చి ఓ మైనర్‌ తల్లిదండ్రులను తలెత్తుకోకుండా చేస్తే..మరో యువకుడ్ని కటకటాలపాల్జేసింది. ఫోర్త్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఆ వివరాలు..తాటిచెట్లపాలెం రెడ్డివీధికి చెందిన 15 ఏళ్ల బాలికకు రీల్స్‌ అంటే పిచ్చి..నిత్యం రీల్స్‌ చేయడం..వాటిని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడం అలవాటు. ఈ క్రమంలో సమీప ఇంట్లో ఉంటున్న భార్గవ్‌..బాలిక చేసిన రీల్స్‌ చూసి లైక్‌ కొట్టాడు. క్రమంగా ఇన్‌స్టాలోనే పరిచయం పెంచుకున్నాడు. 

ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. తనకు రీల్స్‌ చేయాలని ఉందని, దానికి సహకరించాలని బాలికను కోరాడు. లేదంటే చనిపోతానని బెదిరించాడు. దీంతో ఇటీవల కై లాసపురం కొండమీద గల వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వీరిద్దరూ కలుసుకున్నారు. జనవరి 9వ తేదీన మళ్లీ అదే ప్రదేశంలో కలుసుకుని బలవంతంగా బాలిక మెడలో తాళి కట్టాడు. ఆ తరువాత కొద్ది రోజులకు మళ్లీ సదరు బాలికను సింహాచలం తీసుకువెళ్లి అక్కడ మరోమారి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ మేరకు ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు భార్గవ్‌పై పోక్సో, బాల్యవివాహ నిరోధక చట్టం, ఎస్టీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. భార్గవ్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఆ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసును ఫోర్త్‌ టౌన్‌ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement