● డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, సీఐ ప్రసాద్, తహసీల్దార్ పరిశీలన ● రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న వైనం
గంగాధర నెల్లూరు: మామిడి రైతుల సమస్యలను త్వరితగతన పరిష్కరిస్తామని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి హామీ ఇచ్చారు. తెలిపారు. జీడీ నెల్లూరులోని మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అలాగే మామిడి రైతుల దుస్థితిపై సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశాల మేరకు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, జీడీ నెల్లూరు సీఐ ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మనోహర్ గౌడ్ బుధవారం జీడీనెల్లూరు చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఐ ప్రసాద్ ఫ్యాక్టరీ సిబ్బందితో మాట్లాడారు. సీరియల్ నంబర్ల గోల్మాల్కు సంబందించి రికార్డులను పరిశీలించారు. యూనిట్ వన్కు జీడీ నెల్లూరు తహసీల్దారు, యూనిట్ టూకు ఎంపీడీవోను అధికారులుగా నియమిస్తూ సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జరిచేశారు. మండల స్థాయి అధికారులు ఫ్యాక్టరీ వద్ద క్యూలో నిలుచున్న ఉన్న రైతులకు స్వయంగా సీరియల్ నంబర్లు కేటాయించారు.
34 మందికి పదోన్నతులు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని 34 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి లభించింది. ఈ మేరకు అమరావతిలో బుధవారం గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శుల నుంచి గ్రేడ్–1గా పదోన్నతి పొందిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరికి పంచాయతీరాజ్ కమిషనర్ జోన్–4 పరిధిలోని జిల్లాలను కేటాయించగా సంబంధిత కలెక్టర్లు పంచాయతీలకు పోస్టింగ్ ఇవ్వనున్నారు.


