గంగాధర నెల్లూరు: మండల కేంద్రంలోని మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద మంగళవారం ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. యువరైతు లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నం ఘటనపై మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు పట్టించుకోలేదని , రైతులు రాత్రింభవళ్లు కిలోమీటర్ల మేర రోడ్లపై పడికాపులు కాస్తుంటే కూటమి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. గంగాధర నెల్లూరు మండలం జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద బొమ్మవారిపల్లి గ్రామానికి చెందిన యువరైతు లోకేష్ నాయుడు తన ఎనిమిదెకరాల పొలంలో పండించిన మామిడి పంటను ట్రాక్టర్లలో నింపి నాలుగు రోజుల క్రితం పరిశ్రమ వద్దకు తీసుకురాగా మంగళవారం వరకు ఎలాంటి సీరియల్ నంబరు కేటాయించకపోవడంపై మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ప్రతి ఒక్కరినీ కలిసి వేసిందన్నారు. మామిడి రైతులు అవస్థలు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటేపో ఓ పక్క కూటమి నేతలు మాత్రం పాలాభిషేకాలు చేస్తుండడంపై తీవ్రంగా మండిపడ్డారు. రైతుల కష్టాలు పూర్తిగా నెరవేర్చిన తరువాత సంబరాలు చేసుకుంటే మంచిదన్నారు. రైతులు అవస్థలు పడుతూ కన్నీరు కారుస్తుంటే కూటమి నేతలకు పట్టడం లేదన్నారు. అదేవిధంగా విజయవాడలో సాయికృష్ణ మృతిపై సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగాధర నెల్లూరు పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, సీనియర్ నేత రాష్ట్ర మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గుణశేఖర్ రెడ్డి , ఏకాంబరం మోహన్ రెడ్డి పాల్గొన్నారు.


