గంగవరం: బైక్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన మండలంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పెద్దఉగిణి గ్రామంలో మహమ్మద్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతని మొదటి కుమారుడు అమిద్(10) ఇదే గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో 4వ తర గతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి ట్యూషన్ ముగించుకుని చికెన్ సెంటర్లో ఉంటున్న తన తండ్రి దగ్గరకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో బెంగళూరు వైపు వెళ్తున్న బైక్ ఢీకొంది. బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనదారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా పెద్దఉగిణి గ్రామానికి సమీపంలో ఉన్న హైవే నుంచి గ్రామంలోకి రావాలంటే నానా తప్పలు పడాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డు క్రాస్ చేసే క్రమంలో వాహనాలు ఢీకొని ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టు పేర్కొంటున్నారు. అక్కడ స్కై వాకర్ ఏర్పాటు చేయడంతో పాటు లైట్లు వెలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


