సుగాలి ప్రీతి కేసు ఆధారాలు చెరిపేశారనడం సిగ్గుచేటు ఆయన పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు ప్యాకేజీ కోసం చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత పరిపాలనలో రాష్ట్రానికి శనిపట్టింది
నగరి : సుగాలి ప్రీతి కోసమే పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ ఎన్నికల్లో హంగామా చేసి, నేడు ఆ కేసులో ఆధారాలను వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో చెరిపేశారంటూ చేతులెత్తేసిన పవన్కళ్యాణ్ పొలిటిల్ బఫూన్ అయిపోయారని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆమె ఆదివారం వడమాలపేట తిరుమణ్యంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంపై పవన్కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. సుగాలి ప్రీతి చనిపోయింది 2017 చంద్రబాబు పాలనలో అని తెలిపారు. 2019 ఎన్నికల వరకు ఆ కేసు గురించే పవన్ మాట్లాడలేదన్నారు. గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతికి న్యాయం చెయ్యడం కోసమే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారన్నారు. నేడు అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సుగాలి ప్రీతికి ఆయన ఎందకు న్యా యం చెయ్యలేదని ప్రశ్నించారు. పైగా జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలను చెరిపేశారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మనసున్న మారాజు జగనన్న
వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కర్నూలు పర్యటనకు వెళ్లిన సమయంలో సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తమ బాధను చెప్పుకున్నారని తెలిపారు. దీంతో చలించిన ఆయన ఆమె తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, 5 ఎకరాల పొలం ఇవ్వడంతో పాటు కేసును సీబీఐ విచారించాలని కోరారని రోజా అన్నారు. మోదీతోను, అమిత్షాతోను సత్సంబంధాలు పెట్టుకున్న పవన్కళ్యాణ్ సీబీఐ విచారణను ఎందుకు కోరలేదన్నారు. విచారిస్తే పట్టుబడేది టీడీపీ, జనసేన నేతలే కనుక దారి మళ్లిస్తున్నారని పేర్కొన్నారు.
దీనికి ఏం సమాధానం చెబుతావు పవన్?
జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళకు లోబరచుకొని ఐదు సార్లు అబార్షన్ చేయించి, రోడ్డుపై కొట్టిస్తే పవన్ ఏమాత్రం పట్టించుకోలేదని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. జనసేన పార్టీకి చెందిన కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు చంపి బూడిద చేస్తే మాట్లాడడం లేదన్నారు, క్రాంతి అనే దళిత బిడ్డ కనిపించకుండాపోతే పట్టించుకోలేదన్నారు. ఆయన నియోజకవర్గంలో ఒక చిన్నారి రెండు వారాలుగా కనిపించకుంటే పట్టించుకోలేదన్నారు. జనసేన జెండాలు మోసిన వారికీ న్యాయం చెయ్యలేకపోయారని, కాపులకూ న్యాయం చెయ్యలేకపోయారని, దళితులకు న్యాయం చెయ్యలేదని, ప్రజలను పట్టించుకోలేదన్నారు.
రాజకీయాలకు పవన్ పనికిరారు
పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని మాజీ మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని విషయాలపై అవగాహన ఉన్నట్లు ఊగిపోయిన పవన్ నేడు ప్రతి దానిపైనా అవగాహన లేదని తప్పించుకుంటున్నారన్నారు. చంద్రబాబు స్క్రిఫ్ట్ చదవడం మాత్రమే ఆయనకు తెలిసిన పని అన్నారు. ప్యాకేజీల కోసం చంద్రబాబు పల్లకీని మోస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి కాలు కదిపే వరకు ప్రభుత్వంలో కదలికలు రావడం లేదన్నారు. సాయికృష్ణ తల్లిని జగనన్న వెళ్లి చూస్తే వెంటనే చంద్రబాబు ఇంటికి పిలిపించుకున్నారన్నారు. ఆమెకు ఎలాంటి భరోసా ఇచ్చారో మీడియా ముందు చెప్పడం లేదన్నారు. పవన్ను గెలిపించడానికి కష్టపడిన యువకుడు చనిపోతే అతనిపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి పవన్ చేతులు దులుపుకుంటున్నారని, తాను హోంమంత్రి కాదంటూ తప్పించుకుంటున్నారన్నారు. క్రిమినల్ కేసులు ఉంటే చట్టపరంగా శిక్షించాలని లాకప్లో కొట్టి చంపేయడం ఏంటన్నారు. అనిత హోమ్ మంత్రిగా పనికిరాదని ఆయనే చెప్పారని, ఎందుకు పవన్ హమ్ మంత్రిత్వశాఖ తీసుకోకూడదన్నారు.
చదువులు అటకెక్కాయి
మరోవైపు ప్రైవేటు పాఠశాలల, కళాశాలలపై మోజుతో ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరుగుతున్నాయి, పాఠశాలలకు స్కూలు బుక్కులు, బ్యాగులు ఇవ్వలేని దౌర్భాగ్యపు పరిస్థితి ఉందంటే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నదెందుకని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో మాత్రమే పవన్, లోకేష్లు చంద్రబాబును మించిపోయారన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత పరిపాలనలో ఉండటంతో రాష్ట్రానికి శనిపట్టిందన్నారు. బిడ్డలు కనిపంచకుండా పోతే ఆ తల్లులు ఎలా బాధపడతారో తమకు తెలుసన్నారు. సీబీఐ ఎంక్వయిరీ వేసి వారికి న్యాయం జరిగేంత వరకు వదలిపెట్టమన్నారు.


