బైరెడ్డిపల్లె : మండలంలోని పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలో ఉన్న జాలారిపల్లె వద్ద శనివారం టెంపో బోల్తా పడి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా యోగా కోసం మ్యాట్లను వేసేందుకు చిత్తూరు నుంచి కుప్పానికి టెంపో వెళుతోంది. జాలారిపల్లె వద్ద టైర్ పగలడంతో వాహనం బోల్తాపడింది. ఈ సంఘటనలో టెంపోలో ప్రయాణిస్తున్న ఆదామ్ (49), విజయరాజు (37), వినోద్ (29), మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు 108లో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ చందన ప్రియ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి
చిత్తూరు అర్బన్: పరిసరాలను, పర్యావరణాన్ని సంరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటా లని చిత్తూరు ఏఎస్పీ షాను అన్నారు. ఆమె శనివారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో పర్యావరణ సంరక్షణపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి నాగభూషణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
నవోదయ ఫలితాల్లో సత్తా చాటిన విశ్వం
తిరుపతి అర్బన్: జాతీయస్థాయిలో 2026–27కి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యా సంస్థలు సత్తా చాటాయని ఆ సంస్థ అధినేత విశ్వనాథ్రెడ్డి వెల్లడించారు. శనివారం మూడో విడత ఫలితాలు విడుదల చేశారని, తమ వద్ద శిక్షణ పొందిన పద్మిని, చైతన్యనాయక్, ఇందు, బద్రీనాథ్, శాంతికుమారి ఇ. గోమతి, హర్ష, నవనీష్, భావన, సుహాన్ ఉత్తమ ర్యాంకులు సాధించారని వెల్లడించారు. మూడో విడత ఫలితాలతోపాటు 1, 2 విడతల ఫలితాలను కలుపుకుంటే మొత్తం 69 మంది నవోదయ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. దశాబ్దాలుగా విశ్వం విద్యా సంస్థలు నవోదయతోపాటు సైనిక్ స్కూళ్ల ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో ఏటా ర్యాంకులు సాధిస్తుందని చెప్పారు. నవోదయ, సైనిక్ స్కూళ్ల ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కోరుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అదనపు సమాచారం కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


