చిత్తూరు అర్బన్: ఎన్నికల హామీ మేరకు పారిశుద్ధ్య కార్మికులకు కనీసం వేతనం రూ.34 వేలు ఇవ్వాలని మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్.నాగరాజన్ డిమాండ్ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది శనివారం చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ కార్మికులను దశలవారిగా పర్మినెంట్ చేస్తామని, వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చి రెండేళ్లు అవుతున్నా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కార్మికులకు వెంటనే పర్మినెంట్ చేయాలని, అప్పటి వరకు కనీస వేతనంగా రూ.34 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. 50 డివిజన్లను 60గా మార్పు చేస్తున్న సమయంలో కార్మికుల సంఖ్య పెంచకపోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపీనాథ్, కోదండన్, కార్మిక సంఘం నాయకులు వాసు, వినాయక, సురేష్, జయశంకర్, సుగుణ, సుకన్య, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.


