● జైన్ ఫ్యాక్టరీ ఎదుట మిన్నంటిన నిరసనలు ● మద్దతు ధర ఇచ్చేవరకు ఉద్యమిస్తూనే ఉంటాం ● చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన, మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి
మామిడి మద్దతు ధర కోసం వైఎస్సార్సీపీ నేతలు కదం తొక్కారు. క్షేత్ర స్థాయిలో తోటల్లోకి వెళ్లి పంట పరిస్థితి పరిశీలించారు. చెట్లల్లోనే మామిడి పండ్లు పండి.. రాలిపోయి కుళ్లిపోతున్న వైనాన్ని చూసి చలించిపోయారు. గిట్టుబాటు ధరలేక.. ఒకటికి సగానికి తెగనమ్ముకోలేక.. రోడ్లపక్కన పారబోయడాన్ని చూసి ఆవేదనకు లోనయ్యారు. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతుల గోస కూటమి నేతలకు పట్టడం లేదని నిప్పులు చెరిగారు. మామిడికి గిట్టుబాటు ధర ఇచ్చేవరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని రైతులకు భరోసానిచ్చారు.
అడుగడుగునా ఆంక్షలు
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మామిడి పోరుకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించింది. ఫ్యాక్టరీ వద్ద డీఎస్పీ పర్యవేక్షణలో నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేసింది. రోడ్లపై ఉన్న ట్రాక్టర్లను బలవంతంగా ఖాళీ చేయించింది. రైతులు గుంపులుగా ఉండరాదని హుకుం జారీ చేయించింది.
గంగాధర నెల్లూరు: వైఎస్సార్సీపీ మామిడి పోరుబాటకు విశేష స్పందన లభించింది. జీడీనెల్లూరులోని జైన్ మ్యాంగో ఫ్యాక్టరీ ఎదుట బుధవారం చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన చేపట్టారు. తొలుత ఎట్టేరి ప్రాంతంలోని మామిడి తోటను పరిశీలించారు. అక్కడ చెట్ల నుంచి రాలి.. కుళ్లిపోయిన కాయలను చూసి చలించిపోయారు. రోడ్లకు ఇరువైపులా కాయల పారబోతను గమనించారు. అనంతరం ప్లకార్డులతో ర్యాలీగా జైన్ మామిడి ఫ్యాక్టరీ వద్దకు బయల్దేరారు. మార్గమధ్యంలో క్యూకట్టిన మామిడి ట్రాక్టర్లను పరిశీలించారు. రైతులనడిగి మామిడి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీ ఎదుట రైతులతో కలిసి బైఠాయించారు. మామిడికి మద్దతు ధర ఇవ్వాలంటూ నినాదాలు మిన్నంటించారు. మామిడి రైతును ఆదుకునేవారకు నిరసనలు ఆపేది లేదని తేల్చిచెప్పారు.


