పూతలపట్టు(యాదమరి): చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాధంలో గుంటూరు జిల్లాకు చెందిన మామిడి కాయల వ్యాపారి దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు..గుంటూరు జిల్లా నీడుముక్కల గ్రామానికి చెందిన కోటేశ్వరరావు కుమారుడు జి.నరసింహారావు(53) బంగారుపాళ్యం మామిడి యార్డులో వ్యాపారం నిమిత్తం కొంత మందితో కలిసి రెండు రోజులు క్రితం వచ్చారు. వ్యాపారం ముగించుకుని మామిడికాయల లోడుతో గుంటూరుకు బుధవారం రాత్రి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో పూతలపట్టు మండలం, వేపనపల్లి గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం మరమ్మతుకు గురైంది. డ్రైవర్ గోపి వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు. అనంతరం డ్రైవరుతో పాటు వాహనంలోని నలుగురు వ్యక్తులు ట్రాలీ ముందు భాగంలో కూర్చుని సేదతీరుతున్నారు. అయితే అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో తిరుపతి వైపుగా ప్రయాణిస్తున్న ప్రయివేటు సంస్థకు చెందిన బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం ముందు కూర్చున్న నరసింహారావు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర గోపి, కోటేశ్వరరావు, నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పి.కొత్తకోట సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


