కార్వేటినగరం : కూటమి ప్రభుత్వం చేస్తున్న విద్వేషపూరితమైన కుట్రపై గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆమె తిప్పి కొట్టారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టీడీపీకి చెందిన వారే మహిళలుగా కనిపిస్తున్నారని మండిపడ్డారు. మిగిలిన పార్టీల వాళ్లు మనుషులు కాదా..? అని నిలదీశారు. ఎనిమిది నెలల క్రితం తాను నియోజకవర్గంలో కరెంటు పోరుపై ఉద్యమం చేస్తే స్థానిక ఎమ్మెల్యే థామస్ చేసిన అనుచిత వ్యాఖ్యలు గుర్తులేవా..? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి కుమార్తె అని కూడా చూడకుండా కట్టు, బొట్టుపై అనరాని మాటలన్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను హోంమంత్రి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడితే అవి తప్పైపోయాయా..? అని నిలదీశారు.


