గుడిపాల: విద్యార్థుల తల్లిదండ్రులు చిత్తూరు జిల్లాలో రెండు పాఠశాలలకు తాళాలు వేయడంతో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, సీఎంఓ కార్యాలయం నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై చిత్తూరు డీఈఓ గుడిపాల మండల విద్యాశాఖాధికారులైన హసన్బాషా, గణపతిని పిలిపించుకొని వివరణ తీసుకున్నారు. గత మంగళవారం ‘మా గ్రామాల్లోనే స్కూళ్లు ఉండాలి’ శీర్షికన సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైంది. దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్, సీఎంఓ కార్యాలయ అధికారులు ఆరా తీశారు.
ఎందుకు తాళాలు వేశారంటే?
గత సంవత్సరం గుడిపాల మండలంలోని వెంగంపల్లె, సీఎం ఖండిగ ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులను ఏఎల్పురం మోడల్ స్కూల్లో విలీనం చేశారు. దీనిపై విద్యార్థు ల తల్లిదండ్రులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లోనే సుమారు 32 మంది విద్యార్థులను చదివించారు. ఈ ఏడాది కూడా అదే పాఠశాలల్లో చదువుకోవాలంటే విద్యాశాఖాధికారు లు ఒప్పుకోలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు తాళం వేశారు. దీనిపై ఎంఈఓలు, డీఈఓకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
అమ్మకు వందనం కట్
రెండు పాఠశాలల్లో చదువుతున్న 32 మంది విద్యార్థులకు ఈ ఏడాదికి సంబంధించిన తల్లికి వందనం నిలిపేస్తున్నట్టు సమాచారం.


