చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సమస్యల పై వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సోమవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొ న్నారు. కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
నేడు పోలీసు
కార్యాలయంలో గ్రీవెన్స్డే
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 10.30 గంటల నుంచి నేరుగా తనను కలిసి సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
– మద్యం నిల్వలపై కేసుల నమోదు
చిత్తూరు అర్బన్: ఆపరేషన్ ఫ్లష్–అవుట్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలను నిర్మూలించడానికి ఆదివారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఇందులో పలు అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో కేసులు నమోదు చేశామ న్నారు. డ్రగ్ డిటెన్షన్ కిట్స్ సహాయంతో 60 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎన్ఆర్.పేటలో ఇద్దరు, తవణంపల్లెలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. కార్వేటినగరం పరిధిలో సారా తయారీకి ఉపయోగించే 800 లీటర్ల బెల్లం ఊట, పెద్దపంజాణి పరిధిలో 300 లీటర్ల ఊటను ధ్వంసం చేశామన్నారు. యాదమరి స్టేషన్ పరిధిలో సరైన పత్రాలులేని రెండు స్కూటర్లను సీజ్ చేశామని తెలిపారు. బెల్టు దుకాణాల్లో విక్రయించడానికి నిల్వ ఉంచిన డ్యూటీ పెయిడ్ లిక్కర్ను (డీపీఎల్) గుడిపాలలో 120 మద్యం బాటిళ్లు, పెనుమూరు లో 16, రొంపిచెర్లలో 10, కల్లూరులో 10, జీడీ నెల్లూరులో 24, కాణిపాకంలో 15 బాటిళ్లు, రాళ్లబుదుగూరులో 22 లీటర్లు, గుడుపల్లెలో 27 లీటర్ల డీపీఎల్ సీజ్ చేశామని వెల్లడించారు. రామకుప్పంలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మొత్తం ఘటనలపై 15 కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగిస్తున్నట్టు తెలిస్తే 9490617896, ఈగల్ టీం–1972, డయల్–112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.


