● పంటలకు గిట్టుబాటు ధర లేక రైతుల అవస్థలు ● హేళగా మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
వెదురుకుప్పం: పంట లకు గిట్టుబాటు ధర కల్పించకుండా కూట మి ప్రభుత్వం రైతుల నడ్డివిరుస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆరోపించారు. ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడారు. ధరలు లేక వరి పంటను రైతులు కల్లాల్లోనే వదిలేశారని, చెరుకు, మామిడి, వేరుశనగ, మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులు ఆనందంగా ఉన్నారని, కావాలనే వైఎస్సార్ సీపీ రాద్దాంతం చేస్తోందంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని గమనించకుండా ఇంట్లో కూర్చుకుని తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా మాట్లా డడం తగదన్నారు. ఇంత వరకూ వేరుశనగ విత్తనాలు అందించలేదని తెలిపారు. మామిడి రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మామిడి రైతులకు కిలోకు రూ.16 నుంచి రూ.21 వరకు ధర కల్పించినట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కిలోకు రూ.6లు దాటడం లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతి సారీ రైతులను అన్ని విధాలా ముంచేస్తాడని విమర్శించారు. రైతుల కన్నీరు రాష్ట్రానికి అరిష్టమన్నారు.
హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు ఆజ్యం పోసింది చంద్రబాబేనని నారాయణస్వామి స్పష్టం చేశారు. అధికారం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచారని తెలిపారు. వైఎస్ రాజారెడ్డి, వంగవీటి రంగా, వైఎస్ వివేకానందరెడ్డి ఎవరి హయాంలో హత్యకు గురయ్యారో ప్రజలకు తెలుసన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం, ప్రజలకు గొడ్డలి వేటు, వెన్నుపోటు, మోసం, అబద్దాలు ఆయనకు అలవాటేనన్నారు.
మహిళలకు రక్షణ ఏదీ..?
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, చంద్రబాబునాయుడు దిశా చట్టాన్ని నిర్వీర్యం చేశారని నారాయణస్వామి ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడతున్న దుండగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మండి పడ్డారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని లోకేష్ తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. సంపద సృష్టిస్తానని చెప్పి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలవడంతో భయపడి వైఎస్సార్ సీపీపై ఎదురుదాడికి దిగుతోందని చెప్పారు. ఈసారీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.


