చిత్తూరు కలెక్టరేట్ : విభిన్న ప్రతిభావంతులకు తోడ్పాటు అందిస్తే ఉన్నత శిఖరాలు చేరుకుంటారని ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు, జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. స్థానిక జ్యోతిరావుపూలే బీసీ భవనంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ ఆధ్వర్యంలో అలింకో సహకారంతో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశా రు. వారు మాట్లాడుతూ అలింకో సంస్థ సామాజిక బాధ్యతతో దాదాపు రూ.40 లక్షల విలువైన ఉపకరణాలు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. జిల్లాలోని 31 భవిత కేంద్రాల నుంచి విచ్చేసిన 463 మంది పిల్లలకు 564 సహాయక ఉపకరణాలను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. వాటిలో వీల్చైర్స్, ట్రై సైకిళ్లు, చెవుటి మిషన్లు, క్రచెస్ ఎల్బో, సీపీ వీల్చైర్స్, బ్రెయిలీ కిట్లు ఉన్నాయని తెలిపారు. జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ తేజోమూర్తి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు సహాయం చేయడం అందరి బాధ్యత అని అన్నారు. జిల్లా సమగ్రశిక్ష శాఖ ఐఈ కో ఆర్డినేటర్ మధు మాట్లాడుతూ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కుమార్, సెక్టోరల్ అధికారులు మధు, సుభాషిణి, సిబ్బంది గుణ, అలింకో సంస్థ ప్రతినిధులు సూర్యకుమారి, అమర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


