తిరుపతి లీగల్: అడవిలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి తరలించడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తిరుపతి ఎర్రచందనం అక్రమ నిరోధక దళం 2018లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, ఎస్వీఎన్పీ చామల రేంజ్, కేఎంఎం కళాశాల సమీపంలోని అడవిలో తనిఖీలు చేశారు. తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, పడిమలై గ్రామానికి చెందిన అప్పస్వామి, కాశి అడవిలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరకడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.


