ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిపేరు రాము అనే రామ్మూర్తి. వయసు 54 ఏళ్లు. శాంతిపురం మండలంలోని తుమ్మిశి పంచాయతీకి గతంలో సర్పంచ్గా చేశారు. బీసీ గాండ్ల కులానికి చెందిన వాడు. వివాహితుడైన కొడుకు బెంగళూరులో ఉంటే తల్లి లక్ష్మీదేవమ్మ, భార్య జయమ్మతో రాము స్వగ్రామంలో జీవిస్తున్నాడు. సర్పంచ్ కాకమునుపు, సర్పంచ్గా ఉండగా కూడా నిత్యం ఆటో నడుపుతూ, చిరు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకున్న 0.46 సెంట్ల మెట్టభూమి వివాదంలో ఉండడంతో సాగు చేయలేని పరిస్థితి. ఏడాదిన్నర క్రితం రాముకు లివర్ సంబంధిత సమస్య రావడంతో వైద్యం చేయించుకుంటున్నాడు. ఏ పనీ చేయలేక మంచానికే పరిమితమయ్యాడు. గోరుచుట్టపై రోకలి పోటులా భార్య జయమ్మ క్యాన్సర్ భారిన పడడంతో ప్రతి నెలా కీమో థెరపీ చేయించాల్సి వస్తోంది. కొంతవరకు ఆరోగ్యశ్రీ ఆదుకుంటున్నా ఇతర పరీక్షలకు ఖర్చు చేయక తప్పడం లేదు. తల్లి లక్ష్మీదేవమ్మకు నెలనెలా వస్తున్న వితంతు పింఛన్, మోదుగ ఆకులు దొరికే కాలంలో వాటిని పోగేసుకుని తల్లి, భార్య కుట్టే విస్తరాకులతో వచ్చే ఆదాయమే ఈ కుటుంబానికి దిక్కు. సీఎం చంద్రబాబు కరుణించి బీసీ అయిన తనకు 50 ఏళ్ల పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని రాము కోరుతున్నాడు.


