కార్వేటినగరం: సొంత రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి.. పక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు ఊకదంపుడు మాటలతో తమిళ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం మండల పరిఽధిలోని ఆర్కేవీబీపేట గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంపద సృష్టిస్తా.. రాష్ట్రా న్ని అగ్రగామిగా నిలుపుతా అంటూ ఊదరగొట్టిన బాబు కనీసం ఒక్క పరిశ్రమ అయినా తెచ్చాడా..? అని విమర్శలు గుప్పించారు. పచ్చ నేతలకు ప్రకృతి సంపదను అక్రమంగా దోచిపెట్టడమేనా సంపద సృష్టించడం అని ప్రశ్నించారు. ఉపాధి కూలీలకు సక్రమంగా వేతనాలు చెల్లించ లేని దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎండలు మండుతుంటే కనీసం చలివేంద్రా లు కూడా ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలోనూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సంక్షేమాన్ని మరువలేదని గుర్తుచేశారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించే పనిలో మంత్రి లోకేష్ నిమగ్నమై ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ తప్పిదాలన్నీ ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని చురకలంటించారు.
తిరుమలరెడ్డి చిత్రపటానికి నివాళి
మండల పరిఽధిలోని ఆర్కేవీబీపేట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ యువ నాయకుడు /్ఞానసాయిరెడ్డి, అలాగే సీనియర్ నాయకుడు ప్రభాకర్రెడ్డి తమ్ముడు తిరుమలరెడ్డి గతవారం ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం కర్మక్రియలకు హాజరై తిరుమలరెడ్డి చిత్రపటానికి నారాయణస్వామి ఘన నివాళి అర్పించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ లోకనాథరెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి చందురాజు, నాయకులు శేఖర్యాదవ్, నందగోపాల్శెట్టి ఉన్నారు.


