తిరుపతి మంగళం: ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను నమ్మించినట్లే యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగభృతి ఇస్తానంటూ చంద్రబాబు యువతను దగా చేశారని వైఎస్సార్సీపీ యువజన విభాగం చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు ఉదయ్వంశీ మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయని చంద్రబాబు ఇప్పుడు అకస్మాత్తుగా కేవలం ప్రచారం కోసం 10,060 ఉద్యోగాల పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి న కూటమి ప్రభుత్వం, ఇప్పటివరకు ఆ హామీలను నిలబెట్టుకోలేదని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.


