చిత్తూరు కార్పొరేషన్: నగరంలో ఏసీబీ బృందం సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తూనే అదే సమయంలో డ్యాకుమెంట్ రైటర్ల దుకాణంలో సోదాలు చేశారు. పలువురు రైటర్లను అదుపులో తీసుకొని కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో రైటర్ రామకృష్ణ తనిఖీకి వచ్చిన ఏసీబీ కానిస్టేబుల్ పై దాడికి దిగారు. తనిఖీకి వచ్చిన సిబ్బందితో ఐడీ కార్డు చూపాలనడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రామకృష్ణ గొడవకు దిగి దాడి చేయడంతో టూ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో రామకృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
భారీగా నగదు స్వాధీనం
చిత్తూరు అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి ఆధ్వర్యంలో సీఐలు నరసింహారావు, విద్యసాగర్, రమణతో కూడిన బృందం తనిఖీల్లో చేపట్టింది. రిజిస్ట్రార్ కార్యాలయంలోని వివిధ సెక్షన్లలో జరిగిన లావాదేవీలను పరిశీలించారు. అక్కడ నిర్ణీత నగదుకు మించి రూ.95 వేలు ఎక్కువగా ఉండడాన్ని గుర్తించారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో వారి నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. తనిఖీలప్పుడు కార్యాలయంలోని దస్తావేజు లేఖరులు, వారి సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఫోన్ పే లావాదేవీలను పరిశీలించి.. ఈ నగదు ఎవరు పంపారని ఆరా తీశారు.


