పలమనేరు: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ గాయపడిన ఘటన బుధవారం పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మునిలక్ష్మి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై భారీ శబ్దం రావడంతో కొందరు స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పి ప్రమదాన్ని తప్పించారు. గాయపడిన మునిలక్ష్మిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
చట్టబద్ధంగానే కొనుగోలు
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న స్థలాన్ని చట్టబద్ధంగానే విక్రయించినట్లు థియే సోఫికల్ సొసైటీ ఇండియా చాప్టర్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. వారణాసిలోని తమ సొసైటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి నిర్మిస్తున్న నేపథ్యంలో చిత్తూరులోని ఆస్తులను విక్రయించినట్లు పేర్కొన్నారు. ఈ భవనం పురాతనమైనది కావడంతో ఇప్పటికే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నివాసయోగ్యానికి అనుకూలంగా లేదని ధ్రువీకరణ పత్రం సైతం పొందామన్నారు. భవన నిర్మాణ కూల్చివేత పనులన్నీ తమ అనుమతితోనే జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
శిల్పి జక్కన్నకు
కళారత్న పురష్కారం
పలమనేరు: నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం, నేలపల్లికి చెందిన ప్రముఖ శిల్పి తొండవాని పురుషోత్తమాచార్య అలియాస్ జక్కన్న(80)కి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా శిల్పకళారంగంలో చూపిన ప్రతిభకు ఏడాదికి గాను కళారత్న పురష్కారానికి ఎంపిక చేసింది. ఆ మేరకు స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అజయ్జైన్ నుంచి బుధవారం ఆదేశాలందాయి. ఉగాది సందర్భంగా ఆయనకు ఈ పురష్కారాన్ని అందించనుంది. కాగా జక్కన్నకు స్థానిక పలమనేరు రచయితల సంఘం, తెలుగు సాహిత్య సాంస్క్రృతిక సమితి నిర్వాహకులు అభినందలు తెలిపారు.
‘దివ్యాంగశక్తి’ ప్రారంభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులని.. వారి సమస్యలను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్నవారని ఇన్న్చార్జి కలెక్టర్ రాజేంద్రన్ కొనియాడారు. బుధవారం చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండ్లో ‘దివ్యాంగ శక్తి’ (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 33,848 మంది దివ్యాంగులకు ఈ పథకం ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, చుడా చైర్మన్ కఠారి హేమలత పాల్గొన్నారు.


